మీనాక్షీ నటరాజన్ వివాదంపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్
న్యూఢిల్లీ, జూన్ 10: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేత మీనాక్షీ నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణపై వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నామినేషన్ను తిరస్కరించడానికి పరిగణనలోకి తీసుకున్న క్రిమినల్ కేసు..అసలు ఉనికిలోనే లేదని, దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. తెలంగాణలో తనపై నమోదైన కేసు వివరాలను నామినేషన్ అఫిడవిట్లో వెల్లడించలేదన్న బీజేపీ ఫిర్యాదు ఆధారంగా మీనాక్షీ నటరాజన్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి మంగళవారం తిరస్కరించారు. అయితే ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని, కేవలం కోర్టు నోటీసు మాత్రమే జారీ అయ్యిందని కాంగ్రెస్ వాదిస్తున్నది.