ఏపీలో ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0తో సాకారం: సీఆర్ పాటిల్
దిల్లీ: రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు అనుమతులిచ్చినట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ పేర్కొన్నారు. జేజేఎం 2.0పై కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, దిల్లీ నుంచి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఆర్ పాటిల్ మాట్లాడుతూ.. మిషన్ పొడిగింపు కోసం చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ధన్యవాదాలు తెలిపారు. మొదటి దశలో 16 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చామని, ప్రాజెక్టులో లోపాలను సవరించి నిర్వహణ కూడా చేపడుతున్నామని చెప్పారు.
‘‘మరో 3 కోట్ల ఇళ్లకు సురక్షితమైన తాగునీరు అందించాల్సి ఉంది. జేజేఎం 2.0 ద్వారా ఏపీలో ప్రతి ఇంటికి కుళాయి లక్ష్యం నెరవేరుతుంది. 2024 కంటే ముందు మంజూరైన పథకానికి అనుగుణంగానే మిషన్ పొడిగింపు చేపట్టాం. ఏపీలో నీటి నాణ్యత పరీక్షకు డ్వాక్రా మహిళల సేవల్ని వినియోగించుకోవాలి. సాగు కోసం కూడా రైతులకు రెండుసార్లు నీరందితే వారూ సంతోషంగా ఉంటారు. మిషన్ సాకారానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తాం’’ అని సీఆర్ పాటిల్ తెలిపారు.