గ్రేస్ మార్కులపై వివరణ ఇవ్వండి..జేఎన్టీయూహెచ్కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఆర్22 విద్యార్థులకు ఇచ్చే గ్రేస్ మార్కులకు సంబంధించి స్పష్టమైన వివరణ ఇవ్వాలని జేఎన్టీయూహెచ్ ను తెలంగాణ హైకోర్టు గురువారం ఆదేశించింది. కోవిడ్ సమయంలో ఆన్లైన్ తరగతులు, నెట్వర్క్ సమస్యల కారణంగా ఆర్18, ఆర్21 రెగ్యులేషన్ విద్యార్థులకు 0.50 శాతం గ్రేస్ మార్కులు ఇచ్చిన యూనివర్సిటీ.. ఆర్22 విద్యార్థులకు మాత్రం కేవలం 0.15 శాతం మాత్రమే కేటాయించడాన్ని సవాలు చేస్తూ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు విద్యాపరమైన వెసులుబాట్లు, రాయితీలు కల్పించడంలో వర్సిటీ వివక్షపూరిత వైఖరి అనుసరించిందని తెలిపారు. ఆర్22 కింద ఉన్న విద్యార్థులకు మొదట ఎలాంటి గ్రేస్ మార్కులు లేదా క్రెడిట్ మినహాయింపులు ఇవ్వలేదని పేర్కొన్నారు. విద్యార్థులు పదేపదే చేసిన విజ్ఞప్తుల మేరకు కేవలం 0.15 శాతం గ్రేస్ మార్కులను మాత్రమే వర్తింపజేశారన్నారు. మునుపటి బ్యాచ్లతో సమానంగా తమకు కూడా 0.50 శాతం గ్రేస్ మార్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని జేఎన్టీయూహెచ్ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు