జెనీవా వేదికగా శాంతి ఒప్పందం.. ఇరాన్పై ఆంక్షల సడలింపు
పశ్చిమాసియాలో ఘర్షణలను నిలిపివేయడానికి అమెరికా, ఇరాన్ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై ఆదివారం నాటికి జెనీవాలో సంతకాలు జరిగే అవకాశం ఉందని పాశ్చాత్య వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. ఆంక్షల సడలింపు, ప్రాంతీయ కాల్పుల విరమణ నిబంధనలు, ఘర్షణానంతర ఏర్పాట్లపై చర్చలు తుదిరూపు దిద్దుకుంటున్నట్లు వార్తాసంస్థ తెలిపింది. హెజ్బొల్లాకు వ్యతిరేకంగా లెబనాన్లో సైనిక చర్యలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ను కూడా ఈ ఒప్పందం పరిధిలోకి తీసుకోవాలని ఇరాన్ పట్టుపడుతున్నది. అయితే శనివారం నాటికి ముసాయిదా సిద్ధం చేస్తే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖర్ ఆదివానం జెనీవాలో తుది ఒప్పందంపై సంతకాలు చేయడానికి మార్గం సుగమం అవుతుంది.
అయితే జెనీవాలోని వేదిక ఇంకా ఖరారు కాలేదు. కొత్తగా రూపొందుతున్న ఈ ఒప్పందంలో ఆంక్షల సడలింపు, ఇరాన్ ఆస్తులపై స్తంభనను తొలగించడం వంటి రాయితీలు ఉన్నాయని ఇరాన్కు చెందిన ఒక సీనియర్ అధికారి రాయిటర్స్కు తెలిపారు. ఇరాన్ ఈ ఒప్పందాన్ని లెబనాన్తోసహా విస్తృత ప్రాంతీయ కాల్పుల విరమణకు ముడిపెట్టగా అణు చర్చలను తర్వాతి దశకు వదిలివేసింది. అయితే ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకూడదనే వైఖరిని అమెరికా కొనసాగిస్తుండగా తమ అణు కార్యక్రమం శాంతియుతమైనదని ఇరాన్ స్పష్టం చేస్తున్నది. ఆంక్షల సడలింపునకు మించి అమెరికా హామీలు కూడా ఈ ముసాయిదాలో ఉన్నాయని ఇరాన్ వార్తాసంస్థ మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.