భోజనానికి రూ.6.78.. టిఫిన్కు రూ.11.50
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : సహజంగా హోటల్కెళ్లినా.. రెస్టారెంట్కెళ్లినా భోజనానికి ఎక్కువ ధర.. టిఫిన్కు తక్కువ ధర ఉండటం మనం చూస్తుంటాం. భోజనంతో పోల్చితే సగానికంటే తక్కువగా టిఫిన్ ధరలుంటాయి. సహజంగా ఎక్కడైనా ఇదే జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ధరలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలోని సర్కార్ బడుల్లోని విద్యార్థుల బ్రేక్ఫాస్ట్ ధర అధికంగా ఉండగా, మధ్యాహ్న భోజనం ధర తక్కువగా ఉంది. సర్కార్ ఖరారుచేసిన ధరలు చూసి పలువురు విస్తుపోతున్నారు. ధరల వ్యత్యాసంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.City & Local Guides
మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ఒక విద్యార్థికి రోజుకు రూ.6.78 మాత్రమే ఇస్తున్నారు. ఇక 6-12వ తరగతి వరకు గల ఒక విద్యార్థికి రోజుకు రూ.10.17 ఇస్తున్నారు. అదే బ్రేక్ఫాస్ట్కు వచ్చేసరికి 5వ తరగతిలోపు(ప్రీ ప్రైమరీ)గల ఒక విద్యార్థికి రోజుకు రూ.11.50, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గల ఒక విద్యార్థికి రోజుకు రూ.13.50 చొప్పున ధరలు ఖరారుచేశారు. ప్రాథమిక తరగతుల్లో రూ.5, ఉన్నత పాఠశాలల్లో రూ. 2 చొప్పున బ్రేక్ఫాస్ట్ కంటే మధ్యాహ్న భోజనానికి తక్కువగా ఉండటం గమనార్హం. అది కూడా రెండు ఇడ్లీలు, రెండు బోండాలు, రెండు పూరీలకే రూ. 11.50 నుంచి రూ. 13.50 ఖరారుచేయడం గమనార్హం. మధ్యాహ్న భోజన పథకానికి 2026-27 బడ్జెట్లో రూ.547కోట్లు కేటాయించారు. అదే బ్రేక్ఫాస్ట్, పాలకు రూ.856.44కోట్లు కేటాయించారు. మధ్యాహ్న భోజన పథకం కంటే బ్రేక్ఫాస్ట్కు దాదాపు రూ.300 కోట్లు అధికంగా కేటాయించడం గమనార్హం.