పొంగులేటి కాదు.. పక్కా లూటీ
హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పక్కా లూటీ దారే.. అధికారం ఉన్నచోటికి వెళ్లడం, ప్రభుత్వ ఆస్తులు కాజేయడంలో మేటి అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అమరుల స్తూపం సాక్షిగా పొంగులేటి అవినీతి, అక్రమాలను నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఏమాత్రం చీమూనెత్తురు, దమ్మూధైర్యం ఉన్నా రెవెన్యూ రికార్డులతో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. లేకపోతే ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ పర్యాటకం అయినా ఆయనకు బోర్డులు తిప్పేయడం.. పారిపోవ డం అలవాటేనని ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అక్రమ వ్యవహారాలను పక్కా ఆధారాలతో బయటపెట్టిన బీఆర్ఎస్పై బురదజల్లుతున్న పొంగులేటి..
నిన్నటి ప్రెస్మీట్లో నిస్సహాయ మంత్రులను పక్కనబెట్టుకొని గజ్జికుక్కల, ఊరపందుల భాషతో తెలంగాణ పరువుతీసిండు.. మంత్రిననే సోయి మరచి రాఘవ కంపెనీ డైరెక్టర్లా మాట్లాడి అడ్డంగా దొరికిపోయిండు’ అని మండిపడ్డారు. రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా ఇంజినీరింగ్ పేరిట రాష్ట్ర సంపదను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఆ రెండు కంపెనీలే తెలంగాణను నడిపిస్తున్నాయని అనుమానం వ్యక్తంచేశారు. దోపిడీలో భాగంగానే కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టును సైతం పంచుకున్నాయని ఆర్ఎస్పీ ఆరోపించారు.City & Local Guides నాదర్గుల్ భూ కుంభకోణం గురించి బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ సంచలన విషయాలు బయటపెట్టారని, గతంలో ఈ భూములను కాపాడింది కేసీఆర్ సర్కారేనని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పష్టంచేశారు. హైకోర్టుకు వెళ్లి కొట్లాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేశారు. కానీ పొంగులేటి వంటి ప్రభుత్వ గద్ద కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నదని దుయ్యబట్టారు. కానీ నిన్నటి ప్రెస్మీట్లో అడ్డగోలు అబద్ధాలతో బుకాయించారని విమర్శించారు.
పొంతన లేకుండా మాట్లాడి నాదర్గుల్ భూముల చుట్టూ ఉన్న బ్లూషీట్స్ను చూపిన ఆయన బోర్డులపై ఉన్న కంపెనీలను ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. కానీ తాము ప్రజల ముందు ఆధారాలు పెడుతున్నానని చెప్పారు. ‘మొదట కోహినూర్ గ్రూపు బోర్డు వెలిసింది.. అదిపోయి మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అండ్ శిల్పా ఇన్ఫ్రా వచ్చింది.. తర్వాత అదికూడా పోయి మళ్లీ కోహినూర్ డెవలప్మెంట్ గ్రూపు వచ్చింది.. చివరికి ఇవన్నీ తీసేసి రాత్రికిరాత్రి రంగులు చెరిపిన్రు’ అని ఆరోపించారు. హరీశ్రావు అన్ని అధారాలతో అక్రమాలు బట్టబయలు చేసిన వెంటనే కోహినూర్ ఏక్యూ స్క్వేర్ వాళ్లు ప్రెస్మీట్ పెట్టి నాదర్గుల్ భూములపై హక్కులు ఉన్నాయని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. రక్షకుడే భక్షకుడై నాదర్గుల్ భూములను చెరబట్టాడని ఆరోపించారు. అయినా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తిని రెవెన్యూ శాఖలోకి తీసుకోవడం తప్పేనని స్పష్టంచేశారు.