తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు : మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, వచ్చే రెండు, మూడు నెలలు మిషన్ భగీరథ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా అవసరానికి తగ్గట్టుగా వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రతీరోజు నీటి సరఫరా పరిస్థితిపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఎక్కడైనా కొరత తలెత్తితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, పైప్లైన్ లీకేజీలు, సరఫరా లోపాలను సరిదిద్దాలని సూచించారు. వేసవి ప్రత్యేక చర్యల్లో భాగంగా హ్యాండ్ పంపులు, మోటార్లు, పైప్లైన్ల రిపేర్లు చేపట్టడం, గ్రామీణ నీటిసరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని వివరించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ హాజరు నమోదు కష్టంగా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఈ నిబంధనలను సడలించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ దివ్య దేవరాజన్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.