అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో మొదలైన పోలింగ్
గువాహటి, తిరువనంతపురం, పుదుచ్చేరి: అస్సాం, కేరళలతోపాటు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓటర్లకు తమ ఓటు వినియోగించాలని కోరారు.
అస్సాం, కేరళలతోపాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని 296 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు.
అస్సాంలో భాజపా, కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతోంది. కేరళలో లెఫ్ట్, కాంగ్రెస్, భాజపా కూటముల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. పుదుచ్చేరిలో ఎన్డీయే, డీఎంకే కూటముల మధ్య పోటీ జరుగుతోంది.
అస్సాంలోని 126 నియోజకవర్గాల్లో ఉన్న 31,490 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ మొదలైంది. కాంగ్రెస్ నుంచి 99 మంది, భాజపా నుంచి 90 మంది బరిలో ఉన్నారు.
కేరళలోని 140 నియోజకవర్గాల్లో ఉన్న 30,495 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ మొదలైంది. 2.71 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాల్లో ఉన్న 1,099 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేయనున్నారు.