తమిళనాడు ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు ఓకే
తమిళనాడు ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు ముగిసింది. చిన్నాచితకా పార్టీలకు తప్ప ప్రధాన పార్టీల మధ్య సీట్ల పంపకంలో సయోధ్య కుదిరింది.
చెన్నై, మార్చి 23(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు ముగిసింది. చిన్నాచితకా పార్టీలకు తప్ప ప్రధాన పార్టీల మధ్య సీట్ల పంపకంలో సయోధ్య కుదిరింది. అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి, కేంద్రమంత్రులు పీయూష్ గోయల్ తదితరుల నేతృత్వంలో సోమవారం జరిగిన భేటీ అనంతరం సీట్ల పంపకం కొలిక్కివచ్చింది. మొత్తం 234 సీట్లకు గాను, బీజేపీకి 27, డాక్టర్ అన్బుమణి నేతృత్వంలోని పాట్టాలి మక్కల్ కట్చికి 18, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మామక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)కు 11 నియోజకవర్గాలు కేటాయించారు. కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ నేతృత్వంలోని టీఎంసీ, ఐజేకే, పుదియ నీది కట్చి తదితర పార్టీలకు సీట్ల కేటాయింపు జరగాల్సివుంది. మిగిలిన స్థానాలన్నింటిలోనూ(170) అన్నాడీఎంకే పోటీచేయనుంది. మిగిలిన భాగస్వామ్య పార్టీలకు కూడా రేపోమాపో సీట్ల పంపిణీ ముగించనున్నట్లు పళనిస్వామి ప్రకటించారు. సీట్ల కేటాయింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధించబోతోందని, తాము మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.