ప్రపంచ ఇంధన జీవనాడిపై యుద్ధం నీడ
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు మూడోవారంలోకి ప్రవేశించింది. అయితే, ఉద్రిక్తతలు తగ్గే సూచనలు ఇంకా కనిపించడం లేదు. మొదట ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, క్షిపణి వ్యవస్థలపై లక్ష్యంగా చేసిన దాడిగా మొదలైన ఈ చర్య అనంతరం విస్తృత ప్రాంతీయ ఘర్షణగా మారింది.
ప్రారంభ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో సహా పలువురు సీనియర్ సైనికాధికారులు మరణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దీనికి ప్రతిగా టెహ్రాన్ వెంటనే ప్రతీకార చర్యలకు దిగింది. అప్పటినుంచి మధ్యప్రాచ్య ప్రాంతంలో క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు, వైమానిక దాడులు పెరుగుతున్నాయి. ఈ ఘర్షణ దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ సంక్షోభంగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.
యుద్ధంలో ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కొనే బదులు టెహ్రాన్ తన సైనిక వ్యవస్థను విస్తృతంగా విభజించి ప్రతిఘటన సామర్థ్యాన్ని పెంచేవిధంగా నిర్మించింది. ప్రారంభ దాడులు జరిగినప్పటికీ తిరిగి ప్రతిస్పందించగల సామర్థ్యాన్ని ఈ నిర్మాణం కల్పిస్తుంది. ఈ వ్యూహంలో మొదటి కీలక అంశం అసమాన యుద్ధం. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల అధునాతన సాంకేతిక సైనిక వ్యవస్థలను ఎదుర్కొనేందుకు ఇరాన్ ఖరీదైన ఆయుధ పోటీలోకి వెళ్లకుండా వేరే మార్గాన్ని ఎంచుకుంది.
తక్కువ ఖర్చుతో భారీసంఖ్యలో తయారుచేయగల డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించడం ద్వారా అత్యాధునిక రక్షణ వ్యవస్థలను అధిగమించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఉదాహరణకు ‘షాహెద్-136’ అనే ఆత్మాహుతి డ్రోన్ ధర సుమారు 20 వేల నుంచి 50 వేల డాలర్ల మధ్య ఉండగా, అలాంటి డ్రోన్లను అడ్డుకునే పేట్రియట్ క్షిపణి ఒక్కదానికి దాదాపు 4 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. ఈ భారీ వ్యయ వ్యత్యాసమే ఇరాన్ అసమాన యుద్ధ వ్యూహానికి మూలాధారం.