వేసవిలో విద్యుత్ కు డిమాండ్.. సప్లై పెంచేందుకు చర్యలు చేపట్టాలి..
హనుమకొండ, వెలుగు: వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, అంచనాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ నుంచి సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో సోమవారం సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరం ఉన్నచోట ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంచాలని సూచించారు.
భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచినా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ చర్యలు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఇంటర్ లింకింగ్ లైన్స్ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. ఏప్రిల్, మే నెలలో వ్యవసాయ సర్వీసుల మంజూరు స్పీడప్ చేయాలన్నారు. 17 సర్కిళ్ల పరిధిలో అంగన్వాడీ సెంటర్లకు యుద్ధప్రాతిపదికన మీటర్లు అమర్చాలని ఆదేశించారు.
రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ లో భాగంగా సబ్ స్టేషన్ పనులు స్పీడప్ చేయాలన్నారు. మోడల్ సోలార్ విలేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఈలు టి.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, అన్నపూర్ణ, జీఎంలు శ్రీనివాస్, నాగప్రసాద్, మల్లికార్జున్, వాసుదేవ్, వేణుమాధవ్ పాల్గొన్నారు.