ఆ హీరోతో తీయాలనుకున్నారు.. NTR జీతం ₹250.. ‘పాతాళభైరవి’కి 75 వసంతాలు
ఇంటర్నెట్డెస్క్: మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి.. ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి కొత్తగా అనిపించే చిత్రాలు ఇంకొన్ని ఉంటాయి.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మళ్లీ తీయలేని సినిమాలు మరికొన్ని ఉంటాయి.. అలాంటిదే ‘పాతాళ భైరవి’ (Pathala Bhairavi). జానపద చిత్రాలకు ఇదొక డిక్షనరీ. నాటి ప్రేక్షకుడికి తెరముందు పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించిన చిత్రం. మార్చి 15న 1951న విడుదలైన ఈ మూవీ 75ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ‘పాతాళ భైరవి’ లేకుండా ‘క్లాసిక్స్’ సినిమాల జాబితా పరిపూర్ణం కాదు. మరి ఇలాంటి చిత్రం ఎలా రూపొందింది? నటీనటుల ఎంపిక ఎలా జరిగింది?సినిమా మేకింగ్ వెనుక విశేషాలేంటి?
హీరోగా ఎవరిని తీసుకోవాలి..?
చిత్ర పరిశ్రమలో అప్పటికే అక్కినేని వరుసగా సినిమాలు చేస్తున్నారు. దీంతో తోటరాముడిగా ఏయన్నార్. నేపాళ మాంత్రికుడిగా గోవిందరాజుల సుబ్బారావులతో ‘పాతాళ భైరవి’ని తీయాలనేది నాగిరెడ్డి అభిప్రాయం. అయితే, ఎన్టీఆర్తో రెండేళ్లకు నాలుగు సినిమాలు (‘పాతాళభైరవి’, ‘పెళ్ళి చేసి చూడు’, ‘చంద్రహారం’, వాహిని వారి ‘మల్లీశ్వరి’) హీరోగా చేసే ప్రాతిపదికన నెలకు 250 రూపాయల పారితోషికానికి అగ్రిమెంట్ తీసుకున్నారు. ఎన్టీఆర్తో ముందే కాంట్రాక్ట్ చేసుకోవడం వల్ల కానీ, నాగిరెడ్డి అభిప్రాయంతో కె.వి.రెడ్డి, చక్రపాణిలు ఏకీభవించకపోవడం వల్ల కావచ్చు.. ఏయన్నార్, గోవిందరాజుల వైపు మొగ్గు చూపలేదు. అయినా, హీరో విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు.