చమురు సంక్షోభం తాత్కాలికమే!
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ల యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. టెహ్రాన్పై క్షిపణుల వర్షం కురుస్తుండటం, హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో చమురు సరఫరాకు చిక్కులొచ్చి పడ్డాయి. దాంతో భారత ఆర్థిక వ్యవస్థ ఈ సంక్షోభాన్ని తట్టుకోగలదా అనే చర్చ జరుగుతోంది. ఇంధన ధరలు పెరగడంతో పాటు కొరత కూడా ఏర్పడుతోందని ప్రజలు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఇరాన్ యుద్ధం వంటి ప్రాంతీయ సంఘర్షణలు చమురు ధరలను ఎంతోకాలం ప్రభావితం చేయలేవు. చాలామంది ఊహించేదానికంటే వేగంగానే ఈ పరిస్థితి మారిపోవచ్చు.
ప్రపంచ దేశాలు అసూయపడేలా, 2025లో భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 7.4శాతాన్ని చేరుకుంది. ఇండియా ఆర్థిక వ్యవస్థ చమురు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. భారత్కు అవసరమైన చమురులో 40శాతం కంటే ఎక్కువ హర్మూజ్ జలసంధి గుండానే వస్తుంది. బీమా ఖర్చులు పెరగడం, యుద్ధ భయం, ఇతర కారణాల వల్ల ప్రస్తుతం ఆ మార్గంలో నౌకలు చాలా తక్కువగా ప్రయాణిస్తున్నాయి. పశ్చిమాసియాలో భారీ ఉత్పత్తిదారులైన కువైట్, ఖతార్ వంటి దేశాలు తమ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఈ పరిస్థితికి ప్రతిస్పందిస్తున్నాయి. డిసెంబరులో బ్యారెల్కు 61డాలర్లుగా ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర... మార్చి 8 నాటికి దాదాపు 120డాలర్లకు చేరి, ఆ మరుసటి రోజు 91 డాలర్ల దగ్గర స్థిరపడింది. అంటే, ఇది 49శాతం పెరుగుదలను చవిచూసిందన్న మాట. రష్యా చమురు 72 డాలర్లకే లభిస్తున్నప్పటికీ, అది కూడా 46శాతం మేర పెరిగింది. అమెరికా అధిక సుంకాల హెచ్చరికలు మార్కెట్లో భయాన్ని పెంచుతున్నాయి.
అత్యంత దారుణ పరిస్థితుల్లోనే...
చమురు ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా, దీర్ఘకాలం పాటు పెరిగితే, చాలా రంగాలు దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా భారీ ఔషధ పరిశ్రమలు అధికంగా ఇంధనంపై ఆధారపడి పనిచేస్తాయి. హైదరాబాద్లోని దివిస్ లాబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్ వంటి సంస్థలు ప్రొడక్షన్ లైన్లను శుద్ధి చేయడానికి ఖరీదైన వెంటిలేషన్ యూనిట్లను రన్ చేస్తాయి. రవాణా, విద్యుత్ వంటి రంగాలకూ ఇంధనం అత్యవసరమే. యుద్ధం వల్ల చమురు తగినంతగా లభ్యం కాకపోతే పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది. అయితే, మాంద్యం గురించి భయపడటానికి ముందు కొన్ని విషయాలను మనం గమనించాలి. చమురు ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లో అనేక యుద్ధాలు జరిగిన చరిత్ర ఉంది. ఇది చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఒక ఆశ్చర్యకర సత్యాన్ని వెల్లడిస్తుంది. 1980 తరవాత అత్యంత కీలకమైన చమురు ఉత్పత్తి ప్రాంతాల్లో తొమ్మిది ప్రధాన ఘర్షణలు జరిగాయి. ఆ యుద్ధాలు మొదలైన నెల రోజుల్లో ధరలు సగటున 5.5శాతం పెరిగాయి. అదే ఆరు నెలల తరవాత చూస్తే- చమురు ధరలు యుద్ధం ముందునాటి కంటే మైనస్ 3.9శాతం తక్కువగా నమోదయ్యాయి. ఏడాది తరవాత కూడా మైనస్ 5.3శాతం దగ్గరే ఆ ధరలు నిలిచిపోయాయి. అంటే, యుద్ధం ఆరంభమైన మొదట్లో ఇంధన ధరలు తాత్కాలికంగా పెరిగినా, ఆ తరవాత తగ్గిపోతాయన్న మాట!