యువత గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
ముంబై: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. ఇది దేశ యువతకు, ప్రజాస్వామ్యానికి దక్కిన పెద్ద విజయం అని అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థులు 28 రోజుల పాటు చేసిన నిరసనను ఆయన అభినందించారు. విద్యార్థులు పట్టుదలగా పోరాడటంతోనే ప్రభుత్వం స్పందించి మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు ఎంత బలంగా ఉంటుందో ఈ పోరాటం చూపించిందని పవార్ చెప్పారు.
అన్యాయానికి వ్యతిరేకంగా భయపడకుండా నిలిచిన యువతకు, వారికి అండగా నిలిచిన ప్రతిపక్ష నాయకులు, ఎంపీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ మార్కింగ్ ప్రక్రియలో అవకతవకలు, ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో సంస్కరణలు కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.