ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల..బాలికలదే హవా, గిరిజన జిల్లాల రికార్డు!
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్–2026 ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 91.37 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, బాలికలు ఏకంగా 93.57 శాతంతో అద్భుత ప్రదర్శన కనబరిచారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేస్తూ, కాబోయే సాంకేతిక నిపుణులుగా, పారిశ్రామికవేత్తలుగా మహిళా సాధికారతకు ఈ ఫలితాలు నిదర్శనమని కొనియాడారు. గిరిజన జిల్లాలు అల్లూరి సీతారామరాజు (99.11%), పోలవరం (95.46%), పార్వతీపురం మన్యం (93.45%) రాష్ట్రంలోనే టాపర్లుగా నిలవడం విశేషమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది పాలిసెట్ కోసం రికార్డు స్థాయిలో 1,77,581 మంది దరఖాస్తు చేసుకోగా, ఏప్రిల్ 25న జరిగిన పరీక్షకు 1,63,008 మంది హాజరయ్యారు. వీరిలో 1,48,950 మంది అర్హత సాధించారు. విజయం సాధించిన అభ్యర్థులకు మంత్రి అభినందనలు తెలుపుతూ, ఈసారి ఉత్తీర్ణత సాధించని వారు నిరాశ చెందకుండా పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. అభ్యర్థులు తమ ఫలితాలను polycetap.ap.gov.in వెబ్సైట్లో లేదా 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009కు "Hi" అని పంపడం ద్వారా తెలుసుకోవచ్చు.