చంద్రబాబు పాపం.. సీమకు శాపం
మార్కాపురం: చంద్రబాబు పాపం.. సీమకు శాపంగా పరిణమించిందని, రానున్న రోజుల్లో రైతులు, ప్రజలకు తీవ్ర నీటి కష్టాలు ఎదురుకానున్నాయని మాజీ మంత్రి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్ఫోర్స్ చైర్మన్ సాకే శైలజానాథ్, వైఎస్సార్ సీపీ రీజినల్ కో– ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మార్కాపురంలో వైఎస్సార్సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అధ్యక్షతన కృష్ణా జలాల పోరాట సమాలోచన, తాగు, సాగునీటి కోసం పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా శైలజానాథ్, కారుమూరి, ఇతర వక్తలు మాట్లాడుతూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లనుందని, దీనికి చంద్రబాబే కారణమని విమర్శించారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి తానే చంద్రబాబుతో మాట్లాడి సీమ ప్రాజెక్టును ఆపించానని చెప్పారని, దీనిని బట్టి చంద్రబాబు రేవంత్తో కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న విషయం స్పష్టమైందని ధ్వజమెత్తారు.
చంద్రబాబు సీమకు అడుగడుగునా ద్రోహం చేస్తున్నారని వక్తలు మండిపడ్డారు. రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్ను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లారని, మెడికల్ కాలేజీలనూ పూర్తి చేయకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. నాడు శ్రీకృష్ణ కమిటీ దొనకొండను రాజధాని చేయాలని సిఫార్సు చేస్తే.. దానిని పక్కన పెట్టి తన బినామీలు, అనుచరుల కోసం అమరావతిని బాబు రాజధాని చేశారని ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాలని కోరితే పోలవరం నుంచి లిఫ్టు ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలు అందిస్తానని చెప్పడం ఎంత వరకు సబబని నిలదీశారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో నాటి సీఎం వైఎస్ జగన్ సీమ హక్కుల కోసం పోరాడారని గుర్తుచేశారు. వెలుగొండ ప్రాజెక్టుపై బాబు శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, ఆదెన్న, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి, ఒంగోలు ఇన్చార్జిలు డాక్టర్ దద్దాల నారాయణయాదవ్, చుండూరి రవిబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు షంషీర్ అలీబేగ్, కేవీ రమణారెడ్డి, వైవీ రావు మాట్లాడారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు.