రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత్ మోడీ మరోసారి వార్తల్లో నిలిచారు. విలాసవంతమైన జీవనశైలికి పెట్టింది పేరుగా నిలిచే మోడీ, తన కుమారుడికి ఇచ్చే ఖరీదైన బహుమతుల గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. ఇటీవల మాజీ క్రికెటర్ మైఖేల్ వాఘన్తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, తన కుమారుడి వద్ద ఉన్న అరుదైన కార్ల సేకరణ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన చిన్నతనంలో తండ్రి తనకు కారు కొనివ్వలేదన్న వెలితిని గుర్తు చేసుకుంటూ తన కుమారుడికి అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోడీ తెలిపారు. ‘నేను ఎదుగుతున్న క్రమంలో మా నాన్న నాకు ఫెరారీ కొనివ్వడానికి ఎప్పుడూ నిరాకరించేవారు. అది చాలా వేగంగా వెళ్తుందని, ప్రమాదకరమని ఆయన భావించేవారు. కానీ నాకు ఫెరారీ అంటే ప్రాణం. నా 40వ పుట్టినరోజున మా బంధువు నాకు మొదటి కారును బహుమతిగా ఇచ్చారు.
అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కుమారుడికి 21 ఏళ్లు నిండినప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకూ ఒక ఫెరారీ కారును బహుమతిగా ఇస్తున్నాను’ అన్నారు. ప్రస్తుతం మోడీ కుమారుడి వయస్సు 32 ఏళ్లు. అంటే, గత 11 ఏళ్లుగా వరుసగా ఆయనకు ఫెరారీ కార్లు అందుతూనే ఉన్నాయి. ఫలితంగా, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ, ఎక్కువ ఫెరారీ కార్ల సేకరణ కలిగిన వ్యక్తుల్లో ఒకరిగా ఆయన నిలిచారు.