ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ ప్రైవేటు బిల్లు
ఈనాడు, హైదరాబాద్: ‘‘ఆరు గ్యారంటీలకు గానూ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అరహామీ తప్ప ఏమీ అమలు కాలేదు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే సీఎం సంతకం చేసిన దస్త్రం కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ వచ్చే శుక్రవారం శాసనసభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. అందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నాం. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతివ్వాలి’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం పార్టీ సీనియర్ నేతలు, న్యాయ నిపుణులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. 2023 డిసెంబరు 7న సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆరు గ్యారంటీలకు సంబంధించిన దస్త్రంపై సంతకం చేస్తున్నట్లు ప్రకటించిన వీడియోను, అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీలకు చట్టబద్ధత అంశానికి సంబంధించి మాట్లాడిన వీడియోను కేటీఆర్ ప్రదర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘1986లో సీఎంగా ఎన్టీఆర్ ఉన్న సమయంలో అప్పటి భాజపా శాసనసభాపక్ష నేత విద్యాసాగర్రావు శాసనసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. అప్పటి ప్రభుత్వం బిల్లును ఆహ్వానించి ఆమోదించింది. ప్రతిపక్షంగా మేం బిల్లు ప్రవేశపెడుతున్నాం. భాజపా వ్యతిరేకించినా ఇబ్బందేమీ ఉండదు. ప్రైవేటు మెంబర్ బిల్లుకు ప్రభుత్వం సహకరించాలి. మహాలక్ష్మి, చేయూత, రైతుభరోసా, కౌలు రైతులకు సహాయం, విద్యాభరోసా వంటి హామీలు ఏమయ్యాయి’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘‘ప్రభుత్వం ఏర్పడి సుమారు 840 రోజులు గడిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 4 కోట్ల మందికి టోపీ పెట్టింది. శాసనసభలో ఆరు గ్యారంటీల బిల్లుకు చట్టబద్ధత వస్తే 72 లక్షల మంది రైతులకు డబ్బులు వస్తాయి. పంట బోనస్ బోగస్ కాకుండా ఉంటుంది. ఈ చట్టం వస్తే ఆటో డెబిట్ ద్వారా లబ్ధిదారులకు డబ్బులు వస్తాయి. హామీలు చట్టబద్ధంగా అమలవుతాయి. బిల్లుకు మద్దతివ్వాలని అవసరమైతే అన్ని పార్టీలకు లేఖలు రాస్తాం. అభయహస్తం చట్టం తీసుకొస్తామని రాహుల్గాంధీ చెప్పారు. సీఎం పెట్టిన సంతకం ఫైల్ దొరకడం లేదని అంటున్నారు.
దిల్లీ విమాన ప్రయాణంలో పోయిందా? ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? అనే అనుమానం ఉంది. లేకపోతే మొదటి సంతకమే మోసంతో మొదలైందా? అందుకే బిల్లు పెడుతున్నాం. ఒకవేళ ప్రభుత్వం బిల్లుకు ముందుకు రాకపోతే న్యాయపరంగా ముందుకెళ్తాం. ఈ బిల్లుపై న్యాయనిపుణులతో చర్చిస్తాం. ఆర్టీఏ చట్టం ద్వారా వివరాలు తీసుకుంటాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు గంగుల కమలాకర్, వినోద్కుమార్, రవిచంద్ర, శ్రావణ్కుమార్, వివేకానంద, కవిత, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.