ఇరాన్ అణ్వాయుధ కలలకు బ్రేక్.. నెతన్యాహు సంచలన ప్రకటన
ఇరాన్ అణ్వాయుధ కలలకు బ్రేక్ పడిందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రకటించారు. యురేనియం శుద్ధి చేసే శక్తిని ఇరాన్ కోల్పోయిందన్న ఆయన, వ్యూహాత్మక దాడులతో ఇరాన్ సైనిక వ్యవస్థలు ధ్వంసం చేశామని చెప్పారు. ప్రపంచ శాంతి కోసం ఈ దాడులు అనివార్యమన్నారు.
ఆంధ్రజ్యోతి, మార్చి 19: ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో ఇరాన్ సైనిక, అణ్వాయుధ సామర్థ్యం పూర్తిగా దెబ్బతిందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ ఇకపై యురేనియంను శుద్ధి చేసే స్థితిలో లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇప్పుడు యురేనియంను శుద్ధి చేయడం (Enriching Uranium) లేదా బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయడం వంటి పనులు చేయలేదని నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్ లోని కీలకమైన సైనిక స్థావరాలు, అణ్వాయుధ తయారీకి సంబంధించిన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులు నిర్వహించిందని చెప్పారు.
తమ దేశంపై ఇరాన్ జరిపిన దాడులకు ఇది తగిన సమాధానమని, తమను తాము రక్షించుకోవడానికి ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడబోమని నెతన్యాహు హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారకుండా అడ్డుకోవడం కేవలం ఇజ్రాయెల్ కోసమే కాదని, ఇది ప్రపంచ శాంతికి అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. క్షిపణి ఇంధన తయారీ కేంద్రాలు, రక్షణ వ్యవస్థలు ఈ దాడుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు వెల్లడించాయి.