Vishal: జీవితం ఇంత అనిశ్చితమా? ఆర్బీ చౌదరి మృతిపై విశాల్ ఎమోషనల్ ట్వీట్
సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు వంద సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి కన్నుమూశారు. మంగళవారం (April5, 2026) ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనయ్యియింది. ఈయన అసలు పేరు రతన్లాల్ భగత్రామ్ చౌదరి. ఈయన రాజస్థానీ కుటుంబానికి చెందిన వారు. మొదట్లో ఉక్కు, ఎగుమతులు, నగలు మొదలైన వ్యాపారాలు చేసి తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు.
మొదటిగా 1988లో ‘ఆడిపాపం’ అనే మలయాళ చిత్రాన్ని నిర్మించారు. మరో రెండు మలయాళ మూవీస్ తర్వాత 1990లో ‘పుదు వసంతం’ అనే తమిళ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్నుంచీ వరుస తమిళ మూవీస్ నిర్మించారు. తమిళనాట సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న హీరో విజయ్కు.. పూవే ఉనక్కగా, తుళ్ళధ మనముం తళ్ళుం, తిరుపాచ్చి వంటి కెరీర్ బెస్ట్ చిత్రాలను అందించారు ఆర్బీ చౌదరి. ఇక 1994లో శరత్ కుమార్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘కెప్టెన్’ అనే చిత్రాన్ని తెలుగులో నిర్మించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో సుస్వాగతం, వెంకటేష్తో సూర్యవంశం, రాజా, శీను, సంక్రాంతి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. అలాగే నాగార్జునతో నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా సినిమాలను నిర్మించి విజయాలను అందుకున్నారు. నేటి గాంధీ, ప్రియమైన నీకు, సింహరాశి, స్నేహమంటే ఇదేరా, శివరామరాజు, అందాల రాముడు, అన్నవరం, నవ వసంతం, గోరింటాకు, భీమిలి కబడ్డీ జట్టు, రచ్చ లాంటి చిత్రాలను నిర్మించి తెలుగులో మంచి ఇమేజ్ ఏర్పరచుకున్నారు.