సిరికొండ పీఏసీఎస్లో అవినీతి భాగోతం దొడ్డు వడ్లను సన్నాలుగా చూపి.. రూ.38 లక్షల బోనస్ స్వాహా
నిజామాబాద్, వెలుగు: సన్నాల సాగును ప్రోత్సహించేందుకు గవర్నమెంట్ ఇస్తున్న రూ.500 బోనస్ సొమ్మును కాజేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. 2025-–26 ఖరీఫ్లో కొనుగోలు చేసిన దొడ్డు వడ్లను రికార్డులో సన్నాలుగా నమోదు చేసి రూ.38 లక్షల బోనస్ సొమ్మును అక్రమార్కులు కాజేశారు. సిరికొండ పీఏసీఎస్ ఆధ్వర్యంలో మైలారం విలేజ్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఈ అక్రమాలు జరగగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకొని విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో మూడు రైస్ మిల్లులపాత్ర ఉన్నట్లు తేలడంతో యాసంగి వడ్ల అలాట్మెంట్ను రద్దు చేశారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఇంకా ఎక్కడైనా జరిగియా? అనే కోణంలో సివిల్ సప్లై ఆఫీసర్లు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు.
రైతులు సాగు చేసిన వడ్లు కొనేందుకు ప్రభుత్వం పీఏసీఎస్లు, ఐకేపీ, ఐడీసీఎంఎస్, మెప్మా ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. రైతు తెచ్చిన వడ్లు కాంటా పెట్టిన బ్యాగ్లను అలాట్మెంట్ పొందిన రైస్ మిల్లులకు పంపిస్తారు. బ్యాగ్లు అన్లోడ్ చేసుకునే మిల్లర్ వడ్ల రకాన్ని, తూకాన్ని క్రాస్ చెక్ చేసుకొని సంతకం చేసిన ట్రక్ షీట్ తిరిగి కొనుగోలు సెంటర్కు పంపిస్తాడు. వడ్లు అమ్మిన రైతు వివరాలను ట్యాబ్లో ఎంటర్ చేస్తారు. దాని ప్రకారం రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఇదిలాఉంటే సిరికొండ పీఏసీఎస్ పరిధిలోని 13 గ్రామాల్లో వడ్లు కొనుగోలు చేశారు. ఇందులో మైలారం విలేజ్ లో కొనుగోలు చేసిన 7,631 క్వింటాళ్ల దొడ్డు వడ్లను ట్రక్ షీట్ రికార్డులో సన్నాలుగా చూపించి, రూ.38 లక్షల బోనస్ రైతుల ఖాతాల్లో వేయించారు. అయితే తాము దొడ్డు వడ్లు అమ్మితే సన్నాల బోనస్ జమ కావడంతో రైతులు విస్మయానికి గురయ్యారు. ట్యాబ్ ఎంట్రీలో పొరపాటు జరిగిందని చెబుతూ పీఏసీఎస్ స్టాఫ్ రైతుల వద్దకు వెళ్లి బోనస్ డబ్బులను వసూలుచేశారు. కొందరు రైతులు డబ్బు వాపస్ ఇవ్వడానికి నిరాకరించడంతో విషయం బయటకు వచ్చింది. విషయం కలెక్టర్ కుచేరడంతో 15 రోజుల కింద విచారణకు ఆదేశించారు.