‘చర్చలతోనే సమస్యలకు పరిష్కారం.. ఆత్మహత్యలు వద్దు’
నీలగిరి, ఏప్రిల్ 24 : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం, కార్మికులు పట్టుదలకు పోకుండా ప్రజల పక్షాన ఆలోచించాలని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మహత్యల వల్ల కుటుంబాలు వీధిన పడతాయని కార్మికులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. సమ్మె విరమించే దిశగా అడుగులు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుడు శంకరయ్య గౌడ్ ఆత్మహత్య చాలా బాధాకరం అన్నారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నందున ఇటు ప్రభుత్వం మరోవైపు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి వెసులుబాటును కార్మికులు కూడా ఆలోచనలు చేయాలన్నారు.
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నప్పటికీ, ఈసారి ‘తాలు’ సమస్య రైతులకు ఇబ్బందిగా మారిందని మండలి చైర్మన్ అన్నారు. విత్తన లోపాల వల్లే ఈ సమస్య తలెత్తుతోందని అధికారులు చెబుతున్నారని, అకాల వర్షాల ముప్పు ఉన్నందున ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరారు. రైతు బంధు, సన్న వడ్లకు బోనస్ అంశాలపై ఆయన స్పందిస్తూ.. రెండు పథకాలు ఒకేసారి అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోందన్నారు. రైతు బంధు లేదా బోనస్ ఈ రెండింటిలో రైతులకు ఏది ఎక్కువ మేలు చేస్తుందో ప్రభుత్వం ఆలోచించి ఏదో ఒక పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ధాన్యం కొనకపోవడంతో అక్కడి రైతులు తెలంగాణకు వచ్చి ఇక్కడి మద్దతు ధరకు అమ్ముకుంటున్నారని, ఇది స్థానిక రైతులకు నష్టం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రాష్ట్రానికి సహకరించడం లేదని విమర్శించారు.