సగానికి పడిపోయిన అమెరికా పేట్రియాట్, థాడ్ క్షిపణుల నిల్వలు
ఇంటర్నెట్డెస్క్: ఆయతుల్లా ఖమేనీని అంతం చేయడంతో ఇరాన్లో పాలన కూలిపోతుందని అమెరికా వేసిన అంచనాలు తలకిందులు కావడంతో ఇరాన్తో సుదీర్ఘంగా యుద్ధం నడుస్తోంది (Iran War). దీంతో కీలక క్షిపణుల నిల్వలు క్షీణిస్తుండటం అగ్రరాజ్యాన్ని కలవరానికి గురిచేస్తోంది. అమెరికా మీడియా కథనాల ప్రకారం.. పేట్రియాట్, థాడ్ ఇంటర్సెప్టర్ నిల్వలు సగానికి పడిపోయాయి. తోమహాక్ క్షిపణి నిల్వలు కూడా 35 శాతం మేర ఆవిరయ్యాయని పేర్కొన్నాయి. ప్రిసిషన్ స్ట్రైక్ మిస్సైళ్ల నిల్వలో 45 శాతం కంటే ఎక్కువ వాడారు. ఈ స్థాయి వినియోగం అమెరికా సైనిక సన్నద్ధతలో లోపాలను ఎత్తి చూపుతోందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
స్వల్పవ్యవధిలో సైనిక కార్యకలాపాలకు ఈ నిల్వలతో ఢోకా లేనప్పటికీ.. మరే ప్రాంతంలో భారీ ఘర్షణలో పాల్గొనాల్సి వస్తే ఈ ఆయుధ నిల్వలపైనే ఆధారపడే పరిస్థితి లేదన్నారు. అదే సమయంలో ఇరాన్ కీలక సైనిక సామర్థ్యాలను కలిగి ఉందని పెంటగాన్ నిఘా విభాగం అంచనావేసింది. ఇటీవల ఆపరేషన్ తర్వాత కూడా ప్రాంతీయ శక్తిగా మిగిలేఉందని పేర్కొంది. ఆ దేశ సైనిక సామర్థ్యాలను భారీగా దెబ్బతీశామని ట్రంప్ యంత్రాంగం చేస్తోన్న ప్రకటనలకు ఈ అంచనాలు భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ కంటే డొనాల్డ్ ట్రంప్నకే ఒప్పందం ఎక్కువ అవసరంగా కనిపిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.