‘ఇంతకు తెగిస్తారా?’.. నిర్మలపై మమత ఫైర్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంగ్రామం అనూహ్య మలుపులు తిరుగుతూ మరింత వేడెక్కింది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు వేస్తున్న ఎత్తుగడలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) ఉల్లంఘించి, మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేలా వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ)డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
తాజాగా బీజేపీ నేతలు పంపిణీ చేసిన ‘మాతృశక్తి గ్యారెంటీ కార్డుల’ చుట్టూనే ఇప్పుడు కొత్త రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ కార్డుల ద్వారా మహిళా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.3,000 జమ చేస్తామని బీజేపీ పరోక్షంగా హామీ ఇస్తోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆర్థిక ప్రయోజనాలను ప్రకటించడాన్ని మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఇది ప్రజాస్వామ్య నిబంధనలను అపహాస్యం చేస్తూ, ఓటర్లకు బహిరంగంగా లంచం ఇవ్వడమేనని ఆమె మండిపడ్డారు. పోలింగ్కు ముందే ఆదరాబాదరాగా కొత్త ఖాతాలు ఎందుకు తెరుస్తున్నారని, ఇదంతా మహిళా ఓటర్లను ప్రలోభపెట్టే ఓటు బ్యాంకు జిమ్మిక్కు మాత్రమేనని ఆమె ఆరోపించారు.