వైట్ హౌస్లో ఇన్సైడర్ ట్రేడింగ్..?
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి స్టాక్ మార్కెట్లో అసాధారణ స్థాయిలో కొన్ని లావాదేవీలు జరుగుతుండటం ఆందోళనలు కలిగిస్తోంది. యుద్ధానికి సంబంధించిన ప్రధాన విధానపరమైన నిర్ణయాలు బహిరంగంగా ప్రకటించడానికి కొన్ని గంటలు, నిమిషాల ముందు అనుమానాస్పద ట్రేడింగ్లు జరుగుతుండడం గమనార్హం. వీటిలో కొంతమంది ట్రేడర్లు మిలియన్ల కొద్దీ లాభాలు ఆర్జించారు. దీంతో స్టాక్ మార్కెట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ (Insider Trading) జరుగుతున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీరిలో ఎక్కువమంది అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్ (White House) సిబ్బంది, వారి సన్నిహితులే ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాల గురించి అంతర్గత సమాచారం తెలిసినవారు దాన్ని పలువురు మదుపర్లకు లీక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తమ లాభం కోసం వైట్హౌస్ సిబ్బంది రహస్య సమాచారాన్ని లీక్ చేస్తున్నారని వచ్చిన ఆరోపణలను యుద్ధం మొదట్లో అమెరికా అధ్యక్ష కార్యాలయం కొట్టివేసింది. అయితే సున్నితమైన సమాచారంతో ముడిపడి ఉన్న ఫ్యూచర్స్ మార్కెట్లలో మదుపు చేయవద్దని తాజాగా వైట్ హౌస్ తమ సిబ్బందిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లైంది.
రహస్య విధాన నిర్ణయాలపై ప్రకటన వెలువడకముందే వాటికి సంబంధించిన సంస్థల్లో పెట్టుబడులు నమోదవుతుండడంపై దర్యాప్తు చేపట్టాలని పలువురు మార్కెట్ పరిశీలకులు, అమెరికా చట్టసభ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
యుద్ధ అనిశ్చితి.. మార్కెట్లపై ఒత్తిడి
ఇన్ సైడర్ ట్రేడింగ్పై అనుమానాలకు తావిస్తున్న ఘటనలు..
జనవరి: వెనెజువెలాలో అమెరికా సైనిక చర్యకు ముందు ఆయిల్ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్పై అధిక పెట్టుబడులు నమోదయ్యాయి.
మార్చి మొదటి వారం: ఇరాన్పై అమెరికా దాడి జరగడానికి కొన్ని గంటల ముందు కొందరు వ్యక్తులు తమ గుర్తింపు బయటపెట్టకుండా ఇరాన్పై యుద్ధం దాడి జరుగొచ్చన్న అంచనాలు వేసి పాలీ మార్కెట్ (బెట్టింగ్ లాంటిది) కాంట్రాక్టులపై భారీగా పెట్టుబడులు పెట్టి, లాభాలు ఆర్జించారు.
మార్చి చివర-ఏప్రిల్ ప్రారంభం: ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందు క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ షేర్లు భారీగా చేతులు మారాయి. ఆ ప్రకటన తర్వాత చమురు ధరలు పడిపోయాయి. చరిత్రలోనే అతిపెద్ద ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులలో ఇదొకటి అయ్యే అవకాశం ఉందని పలువురు అమెరికా చట్టసభ సభ్యులు అభిప్రాయం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణ ప్రకటనకు ముందు కూడా పెద్దఎత్తున లావాదేవీలు నమోదు అయ్యాయి. ఈవిధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరగడం వల్ల నిష్పక్షపాత మార్కెట్లపై పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోతారు.