సంపన్న అభ్యర్థి లీమారోస్
చెన్నై (ఆర్కేనగర్), న్యూస్టుడే: తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న 58 ఏళ్ల లీమారోస్కు రూ.1,049 కోట్ల ఆస్తులున్నాయి. లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత మార్టిన్ సతీమణి అయిన ఆమె ఇటీవల అన్నాడీఎంకేలో చేరి బరిలోకి దిగారు. సోమవారం నామినేషన్తోపాటు సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను ఆమె వెల్లడించారు. తన పేరుపై 19 కిలోల బంగారం, 1,217 క్యారెట్ల వజ్రాలు, 13 కిలోల వెండి, 33 గ్రాముల ప్లాటినం ఉన్నాయని పేర్కొన్నారు.
తనకు రూ.139.63 కోట్ల చరాస్తులు, రూ.909.94 కోట్లు స్థిరాస్తులు, రూ.8.57 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. తన భర్త మార్టిన్ పేరుపై రూ.887.36 కోట్ల విలువైన చరాస్తులు, రూ.3,262 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వివరించారు. భర్త పేరున 281 గ్రాముల బంగారం, 9.83 క్యారెట్ల వజ్రాలు, 21 కిలోల వెండి, 321 గ్రాముల విలువైన ముత్యాలు ఉన్నాయని తెలిపారు. కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ పేరున రూ.655 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయని, కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.6వేల కోట్లని అఫిడవిట్లో వెల్లడించారు. ఆరో తరగతి వరకు చదివిన ఆమెపై 4 కేసులు పెండింగ్లో ఉన్నాయి.