KTR: డీప్యూటీ సీఎం, మంత్రి తుమ్మలను కలిసిన కేటీఆర్.. ఎందుకంటే?
KTR: సిరిసిల్ల నేతన్నలను విద్యుత్ సంక్షోభం నుంచి కాపాడాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Minister Tummala Nageswara Rao)ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) కలిసి వినతిపత్రం అందజేశారు. రూ. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్, సర్చార్జి మొత్తాలను పూర్తిగా మాఫీ చేయాలని, పాత బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలు ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు.
కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్చార్జిల భారంపై ఆయనకు సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేసి, వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పి. వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న 'బ్యాక్ బిల్లింగ్' భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని వివరణ ఇచ్చారు.
2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్.ఎస్.ఐ (SSI) యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని, అది సర్చార్జిలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరిందని ఆయన పేర్కొన్నారు. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి నేతన్నను ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినతి పత్రంలో విన్నవించారు.