నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో నిర్మించనున్న ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఇండియా(ANMS) స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపనతో ఉత్తరాంధ్రలో కొత్త శకం మొదలుకానుంది.
అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సుమారు రూ. 1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఇండియా (AMNS) ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ప్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కానుండటం దీని అతిపెద్ద ప్రత్యేకత. ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో రెండు దశల్లో ఈ ప్లాంట్ సాకారం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు.
క్యాప్టివ్ పోర్ట్, మౌలిక సదుపాయాలు
ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా రూ. 11,198 కోట్లతో ఒక క్యాప్టివ్ పోర్ట్ను కూడా నిర్మిస్తున్నారు. ఈ ఓడరేవు ద్వారా మరో 6 వేల మందికి ఉపాధి లభించనుంది. ప్లాంట్కు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా జాతీయ రహదారి-16 (NH-16)తో అనుసంధానిస్తూ 4 లేన్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో విశాఖ రీజియన్ భవిష్యత్తులో గ్లోబల్ పరిశ్రమల హబ్గా మారనుంది.
కార్యక్రమ వివరాలు, ప్రముఖుల రాక
ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్రమంత్రులు హెచ్.డి. కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, వంగలపూడి అనిత తదితరులు హాజరుకానున్నారు. మిట్టల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ మిట్టల్, ఆదిత్య మిట్టల్ కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేయగా, నేతల రాక కోసం మూడు హెలిప్యాడ్లు సిద్ధం చేశారు.
సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్
ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 3.30 గంటలకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో శంకుస్థాపన ప్రాంతానికి చేరుకుంటారు. తొలుత ప్లాంట్ నమూనాను (Model), ఎక్స్పీరియన్స్ జోన్ను పరిశీలించి, అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం, రాత్రి 7 గంటలకు చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు.