టీఎంసీ అభ్యర్థుల జాబితా రిలీజ్: భబానిపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ
కోల్కతా: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమ పార్టీ అభ్యర్థుల జాబితాను తృణమాల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ప్రకటించింది. 291 మంది పేర్లతో మంగళవారం (మార్చి 17) క్యాండిడేట్స్ లిస్ట్ను విడుదల చేసింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన కంచుకోట భభానిపూర్ నుంచి బరిలోకి దిగనున్నారు.
జాబితాలో 52 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 95 మంది అభ్యర్థులు ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందినవారు. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా టీఎంసీ 291 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన మూడు నియోజకవర్గాలను తమ మిత్ర పక్షం భారతీయ గోర్ఖా డెమెక్రటిక్ ఫ్రంట్ కు కేటాయించింది.
మమతా బెనర్జీ పోటీ చేయనున్న భబానిపూర్ నియోజకవర్గానికి ఇప్పటికే బీజేపీ తమ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించింది. బెంగాల్ బీజేపీ కీలక నేత, ప్రతిపక్ష లీడర్ సువేందు అధికారి భబానిపూర్లో మమతా బెనర్జీతో తలపడనున్నారు. భబానిపూర్ తో పాటు నందిగ్రామ్ నుంచి కూడా ఆయన పోటీలో ఉన్నారు.
2021 బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ, సువేందు అధికారి పోటీ పడ్డారు. సువేందు అధికారి చేతిలో దీదీ ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె భబానిపూర్ ఉప ఎన్నికలో పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి భబానిపూర్లో సువేందు అధికారి, మమతా బెనర్జీ ముఖాముఖి తలపడనున్నారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్లో సువేందు అధికారి చేతిలో ఎదురైన ఓటమికి దీదీ ఈసారి ప్రతీకారం తీర్చుకుంటారా..? లేక మమతా బెనర్జీపై సువేందు అధికారే మరోసారి పై చేయి సాధిస్తారో చూడాలి.