మస్క్ టీంలోకి.. భారత సంతతి టెకీ అమన్ గొట్టుముక్కల
ఇంటర్నెట్ డెస్క్: భారత సంతతికి చెందిన డెవలపర్ అమన్ గొట్టుముక్కల (Aman Gottumukkala) ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో కలిసి పని చేయనున్నాడు. అమన్ ఇటీవల తన బృందంతో కలిసి ఫైర్బెండర్ అనే ఏఐ కోడింగ్ అసిస్టెంట్ను ప్రారంభించాడు. ప్రోగ్రామర్లు కోడ్ను మరింత సమర్థవంతంగా రాయడానికి ఇది సహాయపడుతుంది. ఎక్స్ఏఐ అడ్వాన్స్ కోడింగ్ ఏఐ సిస్టమ్స్ అభివృద్ధిలో భాగమయ్యేందుకు తాను ఎలాన్ మస్క్కు చెందిన కృత్రిమ మేధ సంస్థ ఎక్స్ఏఐ (xAI)లో చేరుతున్నట్లు అమన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అధునాతన కోడింగ్ AI వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపాడు.
కృత్రిమ మేధ యుగంలో మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఎక్స్ఏఐ సరైన ప్రదేశమని గొట్టుముక్కల పేర్కొన్నాడు. సూపర్ ఇంటెలిజన్స్ను అందుకోవడానికి తాను చేస్తున్న ప్రయత్నానికి అవసరమైన కంప్యూటింగ్ శక్తిని ఎక్స్ఏఐ అందిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశాడు. ఆయన పోస్టుపై ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందిస్తూ.. ఎక్స్ఏఐలోకి ఆహ్వానించారు.
భారత సంతతికి చెందిన అమన్ టెక్సాస్ ఏఅండ్ఎమ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ (2017- 2021) పూర్తి చేశాడు. కళాశాలలో చేరడానికి ముందు.. అతడు టెక్సాస్ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో విద్యనభ్యసించాడు. ఫైర్బెండర్ను ప్రారంభించడానికి ముందు అమన్ పారాడిగ్మ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశాడు. టెక్నాలజీ, క్రిప్టో వ్యవస్థకు సంబంధించిన పలు సాంకేతిక ప్రాజెక్టులు చేశాడు. అతడి కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితం భారత్ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడినట్లు తెలుస్తోంది.