ఇంధన ట్యాంక్పై డ్రోన్ దాడి.. దుబాయ్ ఎయిర్పోర్టు మూసివేత
ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియాలోని పలు దేశాలపై ఇరాన్ దాడులు పెంచుతోంది. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Dubai Airport) సమీపంలో డ్రోన్ల దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ డ్రోన్ ఇంధన ట్యాంక్ను ఢీకొట్టడం (Drone Strike)తో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాశ్రయంలోని అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేసి (Flights Suspended), విమానాశ్రయాన్ని మూసివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు, ఎయిర్పోర్టు సిబ్బందికి సేఫ్టీ నోటీసు జారీ చేశారు. విమానాల స్టేటస్ తెలుసుకునేందుకు విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు.
పలు విమానాలను దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఇంధన ట్యాంక్కు అంటుకున్న మంటలను ఆర్పేందుకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సమీపంలోని ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంధన ట్యాంక్పై దాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలోని కీలకమైన ఇతర మౌలిక సదుపాయాల వద్ద భద్రత పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
వెనక్కివచ్చిన ఎమిరేట్స్ విమానం..
సోమవారం తెల్లవారుజామున కొచ్చి నుంచి దుబాయ్ వెళ్లిన ఎమిరేట్స్ విమానం సోమవారం తిరిగి కొచ్చికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అది బయల్దేరిన కొద్దిసేపటి తర్వాత దుబాయ్ విమానాశ్రయం మూసివేసినట్లు సమాచారం అందడంతో విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు తెలిపారు.