రెండు చోట్ల హ్యాట్రిక్ కోసం పోరు.. బెంగాల్పైనే అందరి చూపూ!
Assembly elections | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఈ వేసవి మరింత వేడెక్కనుంది. మినీ సార్వత్రిక ఎన్నికలుగా భావించే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలకు నగారా మోగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఏప్రిల్ నెలలో ఎన్నికల సమరానికి తెరలేచింది. ఒక్క పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా.. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో రాజకీయ ముఖచిత్రం గమనిస్తే..
15 ఏళ్లుగా దీదీ అడ్డా
పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులను అధికారం నుంచి దూరం చేసి 2011లో పవర్లోకి వచ్చిన మమతా బెనర్జీ.. గడిచిన 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డిన భాజపా.. ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మూడుసార్లు అధికారంలో ఉన్నప్పుడు ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత, ఉపాధ్యాయ కుంభకోణం వంటివి మమతకు ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోటీ చేసినా ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. దీంతో ఈసారీ తృణమూల్ వర్సెస్ భాజపాగానే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 294 స్థానాలకు గానూ ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దఫాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. 2021లో మాత్రం 8 దఫాల్లో ఎన్నికలు నిర్వహించారు.
త్రిముఖమా? ద్విముఖమా?
తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యే మరోసారి ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు విజయ్ ఏ మేర ప్రభావం చూపుతారనేదీ ఆసక్తిగా మారింది. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో డీఎంకే మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాతో జట్టుకట్టిన అన్నాడీఎంకే క్షేత్రస్థాయిలో చెక్కు చెదరని క్యాడర్ బలంతో అధికారంలోకి రావాలని చూస్తోంది. విజయ్ను కూడా కలుపుకొని వెళ్లాలని భాజపా భావిస్తోంది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్రిముఖ పోరు ద్విముఖ పోరుగా మారుతుందా? అనేది ఆసక్తిగా మారింది. అదే జరిగితే తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయి. తమిళనాడులో 234 స్థానాలకు గానూ ఏప్రిల్ 23న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.