రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: చంద్రబాబు
అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. కలెక్టర్లకు వివిధ అంశాలపై లక్ష్యాలను సీఎం నిర్దేశించారు. సంక్షేమం, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. అధికారులు-ప్రజాప్రతినిధుల కార్యక్రమాలపై సీఎం కార్యాచరణ ప్రకటించారు.
‘‘గడిచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి. 2047 స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా 10 సూత్రాల అమలు తీసుకొచ్చాం. నిర్దేశిత లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా అమలు చేయాలి. సూపర్ సిక్స్ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలి. ఎక్కడా చిన్న పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా అమలు చేయాలి’’
‘‘ఉగాది కానుకగా 2.50 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశాలు చేయిస్తాం. గత పాలనలో ట్రూఅప్ పేరిట విద్యుత్ ఛార్జీల భారం వేస్తే.. మేం ట్రూడౌన్ చేశాం. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం’’ అని తెలిపారు.