మహిళల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి: సీఎం రేవంత్
మహిళా దినోత్సవం జరుపుకుంటేనే బాధ్యత తీరిపోయినట్టు కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలను శక్తితో పోలుస్తామని.. కుటుంబ గౌరవాన్ని కూడా మహిళలతో పోలుస్తామని సీఎం తెలిపారు.
హైదరాబాద్, మార్చి 7: మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). శనివారం జేఎన్టీయూలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘స్టాండ్ విత్ హర్’ బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం జరుపుకుంటేనే బాధ్యత తీరిపోయినట్టు కాదన్నారు. మహిళా నాయకత్వం నుంచి వచ్చిన పార్టీ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
మహిళల పట్ల బాధ్యతల్ని నెరవేర్చాలి
మహిళలను శక్తితో పోలుస్తామని.. కుటుంబ గౌరవాన్ని కూడా మహిళలతో పోలుస్తామని సీఎం తెలిపారు. మహిళలకు వేధింపులు.. పట్టణాలు, కాలేజీలు, పబ్లిక్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదని.. సోషల్ మీడియాలో మహిళలు ఎక్కువగా వేధింపులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ‘మనల్ని మనం సవరించుకొని మహిళల పట్ల మన బాధ్యతల్ని నెరవేర్చాలి’ అని సీఎం సూచించారు.