ఎమ్మెల్యేలూ.. ఎన్డీయే ప్రతిష్ఠ దెబ్బతీయొద్దు
సొంత సామర్థ్యంతో గెలవలేదని గుర్తుంచుకోండి 94% సీట్లు గెలిచామంటే నాపై, పవన్ కల్యాణ్, మోదీపై ఉన్న విశ్వాసమే ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పి పరిష్కరించుకోండి కూటమి ప్రభుత్వం నిరంతరం కొనసాగితేనే రాష్ట్రానికి భవిష్యత్తు 13 ఏళ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలపై నిషేధం అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు
నేను, పవన్ కల్యాణ్, భాజపా నేతలు క్రమశిక్షణతో ఉంటే చాలదు. ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం సహా అంతా అదే బాటలో నడవాలి. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మాకు చెప్పి పరిష్కరించుకోండి. అంతేతప్ప వ్యక్తిగత భావోద్వేగాలతో సమస్యలు సృష్టించడం సరికాదు.
‘ఏసుప్రభువుకు అవమానం జరిగిందంటూ సాక్షి పత్రిక ద్వారా క్షమాపణ చెప్పిన జగన్.. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో శ్రీ వేంకటేశ్వరస్వామికి ఎందుకు క్షమాపణ చెప్పడం లేదు? నమ్మకం లేకుంటే దేవాలయానికి వెళ్లకూడదు. మతసామరస్యాన్ని గౌరవిస్తూ వెళ్లినప్పుడు అక్కడి మతపెద్దలు చెప్పినట్లు వినాలి. సంప్రదాయాలను గౌరవించాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం’
‘సాంకేతికత ఉపయోగించుకుంటే ఆయుధం.. బానిసైతే మన జీవితాలు నాశనం. అందుకే ఐటీ శాఖ మంత్రి లోకేశ్ 13 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరవకుండా నిషేధించే ప్రతిపాదన తెచ్చారు. 90 రోజుల్లో దీన్ని అమల్లోకి తెస్తాం. 13-16 ఏళ్ల మధ్య వయసు వారిపైనా చర్చిస్తున్నాం. సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు’
ఈనాడు, అమరావతి: ఎన్డీయేలోని ఏ శాసనసభ్యుడైనా.. తమ వ్యక్తిగత ప్రవర్తన కారణంగా కూటమి ప్రతిష్ఠ దెబ్బ తినకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహా అంతా తమ సొంత సామర్థ్యంతో గెలిచి అసెంబ్లీకి రాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కొనసాగితేనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో మోదీ నాలుగోసారి ప్రధాని అవుతారని, అలాగే ఏపీలోనూ ఎన్డీయే గెలవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. ‘ప్రజల్లో నమ్మకం కలిగించడానికి, వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడటానికి ఎన్నికలకు ముందు నేను, పవన్ కల్యాణ్, అమిత్షా మాట్లాడుకున్నాం. కలిసి నిర్ణయం తీసుకుని ప్రజల్లోకి వెళ్లాం. కొందరు కొత్తవారైనా వారి పోరాటాన్ని గుర్తించి సీట్లు ఇచ్చాం. ఎన్నికల్లో 94% సీట్లు గెలిచామంటే నాపైన, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీపైన ఉన్న విశ్వాసమే కారణం. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేసుకోకూడదు. 2014లో రాష్ట్ర విభజనతో నష్టపోయాం. వైకాపా ఐదేళ్ల పాలనలో 30 ఏళ్లకు సరిపడా విధ్వంసం జరిగింది. ఇప్పుడు మనం కూడా తప్పులు చేస్తే ఇబ్బందులు ఇంకా పెరుగుతాయి. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు రావడం వల్లే.. రాష్ట్రం నిలదొక్కుకుంది. వైకాపా విధ్వంసం నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నామంటే మన చొరవ, కేంద్ర సహకారమే కారణం. ఇది చాలా కీలక సమయం. ఏ వ్యక్తి వల్లా రాష్ట్రాభివృద్ధి ఆగిపోకూడదు’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ..