బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం : కూనంనేని
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): మతం అనే పునాదులపై నిలబడిన బీజేపీకి రాష్ట్రంలో కొన్ని సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నదని, అధికారంలోకి వచ్చేంత బలం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. ప్రస్తుతం పాలకులపై ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉన్నారని, ప్రజా సమస్యలే ఎజెండాగా సీపీఐ భవిష్యత్ కార్యాచరణ చేపడుతామని తెలిపారు. సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో జరిగిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జైత్రయాత్ర చేస్తామంటూ బీజేపీ కలలు కంటుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉంటే 5 స్థానాల్లో, లేదంటే ఒంటరిగా 15 స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సీపీఐ బలంగా ఉన్న 40 నియోజకవర్గాల్లో ఆగస్టు 6 నుంచి 15వరకు పాదయాత్రలు నిర్వహిస్తామని తెలిపారు.