తెలంగాణ ఆవిర్భావోత్సవం.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ(PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి చెందిన భారత్ కల సాకారం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. 2014జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో గ్రీటింగ్స్ చెబుతూ.. తెలంగాణ ప్రజలు తమ సృజనాత్మకతకు, వ్యాపార దృక్పథానికి ప్రసిద్ధులు అని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం ధైర్యానికి, సంకల్పానికి,పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన గొప్ప చరిత్ర, వైభవోపేతమైన సంస్కృతిని కలిగి ఉందన్నారు. వికసిత భారత్ అనే మన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్ధి ప్రస్థానానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించడానికి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలూ,విజయాలూ కలగాలని ప్రార్థిస్తున్నట్లు తన ఎక్స్లో ప్రధాని మోదీ చెప్పారు.