Select Location
All Locations
State
Region
City / District
Tamil Nadu Elections | తమిళనాడులో ఎన్నికల వేళ భారీగా ధన ప్రవాహం.. రూ.1200 కోట్లు సీజ్‌

Tamil Nadu Elections | తమిళనాడులో ఎన్నికల వేళ భారీగా ధన ప్రవాహం.. రూ.1200 కోట్లు సీజ్‌

Tamil Nadu Elections : తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్‌కు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండటంతో ఎన్నికల అధికారులు తనిఖీలను తీవ్రతరం చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన సొమ్ము, వస్తువుల మొత్తం విలువ రూ.1200 కోట్లు దాటిందని అధికారులు తెలిపారు.

ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నేరుగా రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, వస్తువులను సీజ్ చేయగా.. ఆదాయపు పన్ను శాఖ వంటి ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు జరిపిన సోదాల్లో మిగతా మొత్తం పట్టుబడింది. నగదుతో పాటు, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన భారీ మొత్తంలో మద్యం, నిషేధిత పదార్థాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూపన్లు, ఇతర ఉచితాలను పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి సుమారు 100 కేసులు నమోదు చేశారు.

జిల్లాల వారీగా చూస్తే, తిరువళ్లూరులో అత్యధికంగా సొమ్ము పట్టుబడగా, ఆ తర్వాత చెన్నై నిలిచింది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా 95 శాతానికి పైగా ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మొత్తం 234 నియోజకవర్గాల్లో 105 నియోజకవర్గాలను ఎన్నికల వ్యయంపరంగా సున్నితమైనవిగా గుర్తించారు. 5,938 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి, అక్కడ అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు సహా రెండు లక్షల మందికి పైగా ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


Smacy News 2 days ago
Home Flash News