మూడేళ్ల క్రితమే అభిప్రాయం చెప్పాం.. అందులో మార్పు లేదు: కేటీఆర్
హైదరాబాద్: లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరిగితే సహించేది లేదని.. బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పునర్విభజన ప్రక్రియపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్.. 2023 సెప్టెంబర్లో తాను చేసిన పోస్టును ట్యాగ్ చేశారు. మూడేళ్ల క్రితం బీఆర్ఎస్ అభిప్రాయం చెప్పామని.. అందులో మార్పు లేదని స్పష్టం చేశారు. పునర్విభజనలో అన్యాయం జరిగితే దక్షిణాదిలో బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని నాడు కేటీఆర్ తెలిపారు. దేశంలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల ప్రతినిధులుగా ఉండడం గర్వకారణమన్నారు. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలో తమ ప్రజల గొంతుక, ప్రాతినిధ్యాన్ని అణచివేస్తే చూస్తూ మౌన ప్రేక్షకులుగా ఉండలేమని పేర్కొన్నారు. దిల్లీ పాలకులు తమ మాటలు వింటారని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు నాడు కేటీఆర్ తెలిపారు.