Election Commission of India: తృణమూల్ కాంగ్రెస్కు గట్టి వార్నింగ్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఇవాళ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఈసారి బెంగాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా, నిర్భయంగా జరుగుతాయని పేర్కొన్నది. ఈసీ ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఓ ట్వీట్ పోస్టు చేసింది. హింస లేకుండా, బెదిరింపులు లేకుండా, తనిఖీలు లేకుండా, పోలింగ్ బూత్ల్లో జామ్ లేకుండా ఎన్నికల నిర్వహణ జరగనున్నట్లు ఈసీ పేర్కొన్నది. ఇక ఆ రాష్ట్రానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. టీఎంసీకి సూటిగా హెచ్చరిక చేస్తున్నట్లు తన ట్వీట్లో ఈసీ చెప్పింది. కచ్చితంగా ఈసారి బెంగాల్లో ఎన్నికలు నిర్భయంగా, స్వేచ్ఛగా జరుగుతాయని పేర్కొన్నది.
అయితే ఇవాళ ఉదయం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తృణమూల్ నేతలు కలిశారు. అక్కడ టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ .. సీఈసీపై గట్టిగా అరిచినట్లు తెలిసింది. ఆ సమయంలో సీఈసీ జ్ఞానేశ్, డెరిక్ ఒబ్రెయిన్ మధ్య వాగ్వాదం నడిచింది. తమను వెళ్లిపోవాలని సీఈసీ అరిచినట్లు ఒబ్రెయిన్ ఆరోపించారు. కానీ టీఎంసీ నేత చేసిన వ్యాఖ్యలను ఈసీ కొట్టిపారేసింది. సీఈసీని కలిసినవారిలో మేనకా గురుస్వామి, సాగరికా ఘోష్, సాకేత్ గోకలే ఉన్నారు. 27 లక్షల మంది ఓటర్ల తొలగింపు అంశంలో ఈసీతో చర్చించేందుకు టీఎంసీ ప్రయత్నించింది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.