శత్రువులు పశ్చాత్తాప పడేవరకూ పోరాడతాం: ఇరాన్
ఇంటర్నెట్డెస్క్: యుద్ధం ముగించే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటుండగా.. ఇరాన్ (Iran) అధికారుల నుంచి వస్తున్న వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. అమెరికా- ఇజ్రాయెల్ చేసిన దురాక్రమణకు.. వారు పశ్చాత్తాప పడేవరకూ తమ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉంటాయని తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi)తో ఆయన చర్చించారు. ఈ క్రమంలోనే అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఇరాన్ పౌర, రక్షణ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడమే.. ఈ ప్రాంతంలో అస్థిరతకు కారణమని అరాగ్చీ పేర్కొన్నారు. తమ లక్ష్యాలన్నీ నెరవేరి.. హింసాత్మక దురాక్రమణకు పాల్పడినందుకు గాను శత్రువులు పశ్చాత్తాప పడేవరకూ ప్రతీకార దాడులు కొనసాగుతాయన్నారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడం తమ మొదటి ప్రాధాన్యం అని వెల్లడించారు. హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో సహా తాము తీసుకున్న చర్యలన్నీ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయన్నారు.
ఇదిలాఉండగా.. అమెరికా- ఇరాన్ మధ్య దౌత్య చర్చలకు అడుగులు పడుతుండగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో పాటు పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్కు అమెరికా- ఇజ్రాయెల్ తాత్కాలిక రక్షణ కల్పించాయి. చర్చలు కొనసాగుతున్నంతకాలం ఈ రక్షణ ఉంటుందని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.