Pawan Kalyan:పవన్ కల్యాణ్కు హైకోర్టులో ఊరట.. సినిమాల్లో నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషన్ కొట్టివేత
Relief for Pawan in AP High Court:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన సినిమాల్లో నటించకుండా నిలువరించాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ మేరకు తీర్పునిచ్చారు.
మాజీ ఐఏఎస్ విజయ్కుమార్ తన పిటిషన్లో ప్రధానంగా 'హరిహర వీరమల్లు' సినిమా అంశాన్ని ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి సినిమాల్లో నటించడం అనైతికమని, సినిమా ప్రమోషన్ల కోసం పవన్ తన అధికార యంత్రాన్ని, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా, ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ, దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడిషనల్ ఏజీ సాంబశివ ప్రతాప్ బలమైన వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రులు లేదా మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి చట్టపరమైన నిషేధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పును వారు గుర్తు చేశారు. టికెట్ ధరల పెంపు అనేది నిర్మాతల అభ్యర్థన మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, ఇందులో పవన్ పాత్ర లేదని వెల్లడించారు. ఈ పిటిషన్ రాజకీయ ప్రేరేపితమని, దీనికి విచారణార్హత లేదని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం వపన్పై వేసిన పిటిషన్ను కొట్టివేసింది.
మరో కీలక పరిణామంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించే లక్ష్యంతో 'జల్ జీవన్ మిషన్ 2.0'పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సమక్షంలో ఈ ఒప్పంద ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలని కేంద్రం సూచించింది. గత ప్రభుత్వం ఈ మిషన్ను నిర్వీర్యం చేసిందని పవన్ కల్యాణ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి నిధులు రాబట్టిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలోని గ్రామీణ నీటి సరఫరాను మెరుగుపరిచే దిశగా ఈ ఒప్పందం ఒక మైలురాయిగా నిలవనుందని పవన్ ఆకాంక్షీంచారు.