తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఆర్డీటీ సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీ కార్యకలాపాలు ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఆర్డీటీ సేవలు ఆగిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చర్చలు జరిపారు.
అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీ (Rural Development Trust) కార్యకలాపాలు ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఆర్డీటీ సేవలు ఆగిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీకి అవసరమైన అనుమతులు మంజూరయ్యాయి. దీంతో సంస్థకు ఎదురైన పరిపాలనా అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్డీటీ డైరెక్టర్ మంచో ఫెర్రర్ స్థాపించిన ఈ సంస్థ ద్వారా దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో అందుతున్న సేవలు వెలకట్టలేనివి.
అనంతపురం జిల్లాతో పాటు యావత్ రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) కు కేంద్ర ప్రభుత్వం నుంచి FCRA (Foreign Contribution Regulation Act) పునరుద్ధరణ లభించడం ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచింది.
అనంతపురం జిల్లా సామాజిక, ఆర్థిక చిత్రపటాన్ని మార్చేసిన ఆర్డీటీ (RDT) సంస్థకు ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది. విదేశీ నిధుల సేకరణకు అవసరమైన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ను కేంద్ర ప్రభుత్వం మార్చి 22, 2031 వరకు పొడిగిస్తూ అధికారికంగా వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, రాయలసీమతో పాటూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆర్డీటీ ఎంత అవసరమో వివరించారు. నిలిచిపోతాయనుకున్న అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో కొనసాగనున్నాయి.
ఈ లైసెన్స్ పునరుద్ధరణ వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కృషి అనితరసాధ్యమైనది. ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లి, కేంద్ర హోం శాఖాధికారులు, మంత్రులతో భేటీ అయ్యారు. ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న నిరుపమాన సేవలను వారికి వివరించి, సాంకేతిక ఇబ్బందులను తొలగించేలా ఒప్పించారు.