CM Chandrababu: నా వల్లే హైదరాబాద్ అభివృద్ధి: సీఎం చంద్రబాబు
CM Chandrababu: హైదరాబాద్ను మించేలా అమరావతిని నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయాంలో అమరావతిని పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తంచేశారు. అధునాతన టెక్నాలజీతో అమరావతిని స్మార్ట్ సిటీగా మారుస్తామని ప్రకటించారు. కృత్రిమ మేధ వినియోగం, విస్తరణ లక్ష్యంగా గచ్చిబౌలిలోని ఐఎస్బీలో ఏర్పాటు చేసిన సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1990 తర్వాత మన వద్ద ఇంటర్నెట్ ప్రారంభమైందని, 1995 నుంచి నాలెడ్జ్ ఎకానమీ మొదలైందని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు తెచ్చేందుకు అనేక మందితో మాట్లాడనని తెలిపారు. ఢిల్లీ వెళ్లి బిల్ గేట్స్ను కలిశానని గుర్తుచేశారు. భారత్లో ఐటీ కంపెనీలు పెట్టాలని కోరానని పేర్కొన్నారు. లెక్కలు, ఇంగ్లిష్లో భారతీయులు గొప్పవాళ్లని ఆయనకు చెప్పానని వివరించారు. హైదరాబాద్లో ఐటీ కార్యాలయం పెట్టాలని బిల్గేట్స్ను కోరినట్లు చెప్పారు.
అప్పట్లో హైదరాబాద్ వచ్చేందుకు వాళ్లు తొలుత నిరాకరించారని, అక్కడికి వస్తే తమకు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తారని అడిగారన్నారు. అప్పట్లో ఐఎస్బీ తెచ్చేందుకు కృషి చేసినట్లు చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్టు కోసం ఐదువేల ఎకరాలు సేకరించామన్నారు. హైదరాబాద్కు అనేక విద్యాసంస్థలు, నల్సార్, ట్రిపుల్ ఐటీ తీసుకువచ్చినట్లు వివరించారు. అప్పట్లో కేవలం మంజీరా నుంచి తాగునీరు వచ్చేదని తెలిపారు. కానీ కేవలం 9 నెలల్లో కృష్ణానది నుంచి తాగునీరు తీసుకొచ్చామన్నారు.
1999-2004 మధ్య హైదరాబాద్ను శరవేగంగా అభివృద్ధి చేశామని సీఎం చెప్పారు. అప్పట్లో తాను కృషి చేయడం వల్లే జినోమ్ వ్యాలీ వచ్చిందన్నారు. అనేక కారణాల వల్ల 2004లో ఓడిపోయామన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పదేళ్లు పట్టిందన్నారు. 2014 నుంచి 2019 వరకు ఏపీలో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కేవలం అభివృద్ధి మీదే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేమని స్పష్టం చేశారు. 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు.
2024లో మళ్లీ వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్నామన్నారు. ఇప్పుడు అనేక రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. 30 ఏళ్ల కింద ఐటీ గురించి ఆలోచించామని తెలిపారు. ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటమ్, స్పేస్ టెక్నాలజీ వచ్చాయన్నారు. డ్రోన్లు, ఎయిర్ అంబులెన్స్లు త్వరగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత యుద్ధాల్లో డ్రోన్ టెక్నాలజీ ఎలా ఉందో చూస్తున్నామన్నారు. విద్యుత్ సమస్యలను అధిగమించి మిగులు వరకు తీసుకొచ్చామన్నారు. సోలార్, విండ్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీరంగంలో దక్షిణాదిలో తామే నెంబర్వన్ అన్నారు.