రఘురామకృష్ణరాజుపై ఏ ప్రాతిపదికన దేశద్రోహం కేసు పెట్టారు?
ఈనాడు, అమరావతి: ‘రఘురామకృష్ణరాజుపై దేశద్రోహం వంటి తీవ్ర సెక్షన్ల కింద కేసు పెట్టాలంటూ ఏ ప్రాతిపదికన మీరు విచారణ నివేదికలో సిఫార్సు చేశారు? ఆయన వ్యాఖ్యలున్న వీడియోలు మీరు చూశారా? ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించి అవి నిజమైనవేనని నిర్ధారించుకున్నారా?’ అంటూ బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఎం.సునీల్నాయక్ను దర్యాప్తు అధికారి, విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రశ్నించినట్లు సమాచారం. రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయన్ను సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారంటూ నమోదైన కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి సునీల్నాయక్ సోమవారం గుంటూరులోని సీసీఎస్లో విచారణకు హాజరయ్యారు. ఆయన్ను దర్యాప్తు అధికారి ఏఆర్ దామోదర్ విచారించారు. 50కి పైగా ప్రశ్నలు అడిగారు. అయితే ఆయన ఏ ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానమివ్వలేదని తెలిసింది.
ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే రఘురామను అరెస్టు చేయటానికి హైదరాబాద్కు బృందాల్ని ఎలా పంపించారు? ఇలా చేయడం ముందస్తు కుట్రలో భాగం కాదా? అని ప్రశ్నించగా.. సునీల్నాయక్ నీళ్లు నమిలినట్లు సమాచారం. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం లోపలికి వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ వెళ్లిన రఘురామకృష్ణరాజు... మరుసటి రోజు కోర్టులో హాజరుపరచటానికి తీసుకెళ్లినప్పుడు నడవలేని స్థితిలో ఎందుకున్నారు? అని అడగ్గా.. తనకు తెలియదని సునీల్నాయక్ సమాధానమిచ్చినట్లు సమాచారం.
రఘురామను అరెస్టు చేసిన రోజు రాత్రి ఆయన్ను నిర్బంధించిన గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి సునీల్నాయక్తో పాటు వెళ్లిన గన్మన్, డ్రైవర్ను కూడా సోమవారం విచారణకు పిలిపించారు. ఆ రోజు రాత్రి ఎన్ని గంటలకు సునీల్నాయక్ సీఐడీ కార్యాలయానికి వచ్చారు? ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు? తిరిగి ఎన్ని గంటలకు వెళ్లారు? ఆయన సీఐడీ కార్యాలయం లోపలికి వెళ్లినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు ఏమేం జరిగింది? అనే అంశాలపై వారిని ప్రశ్నించారు. అవే అంశాలపై అంతకు ముందు సునీల్నాయక్ను అడిగారు. డ్రైవర్, గన్మన్లు చెప్పిన విషయాలకు, సునీల్నాయక్ చెప్పిన వాటికి పొంతన లేకపోవటంతో.. ముగ్గుర్ని కలిపి ప్రశ్నించారు.