Deputy CM Pawan Kalyan: ప్రధాని మోడీ ప్రయాణం కోట్ల మందికి ప్రేరణ.. అభినందనలు తెలిపిన పవన కల్యాణ్..
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రభుత్వ అధిపతిగా నిరవధికంగా 8,931 రోజుల సేవ పూర్తి చేసిన సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన నరేంద్ర మోడీ రాజకీయ ప్రయాణం, భారత ప్రధానిగా కొనసాగుతూ దేశానికి విశేష సేవలు అందించిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
పదవిలో గడిపిన కాలం మాత్రమే కాకుండా, అచంచల సంకల్పం, అలసటలేని కృషి, దేశ సేవకు అంకితమైన జీవితం ప్రధాని మోడీని ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయని ఆయన అభిప్రాయపడ్డారు పవన్ కల్యాణ్.. “గ్రాస్ రూట్ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి దేశాన్ని నడిపిస్తూ ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతంతో పాలనకు కొత్త నిర్వచనం ఇచ్చారు” అని పవన్ కల్యాణ్ అన్నారు. రెండు దశాబ్దాలకు పైగా క్రమశిక్షణ, త్యాగం, అపార కృషితో కొనసాగుతున్న నాయకత్వం దేశ అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు. మౌలిక వసతులు, పేదల సాధికారత, డిజిటల్ మార్పులు వంటి రంగాల్లో ప్రధాని మోడీ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.
ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్టను పెంచడంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర కీలకమని పేర్కొన్నారు పవన్ కల్యాణ్… ఈ మైలురాయి నిజమైన నాయకత్వం స్థిరత్వం, నిబద్ధత, స్వార్థరహిత సేవపై ఆధారపడుతుందని గుర్తుచేస్తుందని అన్నారు. ఇక, ప్రధాని మోడీకి మరింత ఆరోగ్యం, శక్తి కలగాలని, దేశసేవలో ఇంకా ఎన్నో సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ (ట్వీట్) పెట్టారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..