ఇరాన్పై యుద్ధానికి భారత్ను సాయం కోరినట్లు కథనాలు.. స్పందించిన కేంద్రం
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ను(Iran) ఎదుర్కొనేందుకు అమెరికా.. భారత్ నుంచి సైనిక సాయం కోరినట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ(MEA) స్పందిస్తూ.. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలంటూ కొట్టిపారేసింది.
పశ్చిమ భారత్ నుంచి ఇరాన్పై దాడులు చేసేందుకు వీలుగా మిలిటరీ స్థావరాలను వినియోగించుకుంటామని అమెరికా(USA) అడిగినట్లు ఆ వార్తల సారాంశం. ఇందుకు సంబంధించి కొన్ని ఆంగ్ల మీడియాల్లోనూ కథనాలు రావడంతో విదేశాంగ శాఖ తమ ఫ్యాక్ట్చెక్(MEA FactCheck)లో స్పందించింది. ‘‘ఇలాంటి అసత్య వార్తలను నమ్మవద్దు. నిరాధారమైన, కల్పిత విషయాలపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుతున్నాం’’ అంటూ పోస్ట్ చేసింది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ గతంలోనూ భారత్పై పలుమార్లు అసత్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇరాన్ యుద్ధ నౌక (Iran Warship) ఐరిస్ దేనా-75పై అమెరికా జలాంతర్గామితో దాడి చేసి ముంచేసింది. ఆ సమయంలోనూ భారత పోర్టులను అమెరికా ఉపయోగించుకుంటోందన్న వార్తలు వచ్చాయి. వాటిని విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలే అంటూ తేల్చిచెప్పింది.