చమురుపై ట్రంప్ కన్ను.. ఖర్గ్ స్వాధీనానికి సన్నాహాలు
ఇంటర్నెట్డెస్క్: యుద్ధం ప్రారంభమై, ఖమేనీని అంతమొందించి రెండు వారాలు దాటినా.. ఇరాన్లో పాలనాయంత్రాంగం మాత్రం కొనసాగుతోంది. వెనెజువెలా మాదిరిగానే ఇక్కడి వనరులను తన అధీనంలోకి తెచ్చుకోవాలన్న ట్రంప్ ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు అయిన ఖర్గ్ ఐలాండ్ (Kharg Island)ను ఆక్రమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారట. ఇప్పటికే తమ దళాలు జరిపిన దాడుల్లో అక్కడ చాలా భాగం ధ్వంసమైందని, మరిన్ని దాడులు జరగొచ్చని ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వాధీనం అవకాశాలను పరిశీలిస్తున్నారని అమెరికా అధికారులను ఉటంకిస్తూ యాక్సియోస్ కథనం పేర్కొంది. హర్మూజ్లో అంతరాయాలు కొనసాగితే.. ఈ దిశగా ట్రంప్ సేనలు ముందుకువెళ్లనున్నాయని తెలుస్తోంది. అందుకోసం బలగాలు గ్రౌండ్ ఆపరేషన్కు దిగాల్సిఉంటుంది.
‘‘ఖర్గ్ ద్వీపంలో గ్రౌండ్ ఆపరేషన్కు సంబంధించి అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హర్మూజ్ను తెరిచే ప్రయత్నాలు నిలిచిపోతే మాత్రం.. ఆ ఆలోచన మారొచ్చు’’ అని వైట్హౌస్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఈ ద్వీపం కీలకం కావడంతో దాని స్వాధీనం గురించి ఆలోచిస్తున్నారని మరో అధికారి వెల్లడించారు. ఇరాన్లో అమెరికా భూతల దాడులకు సిద్ధమైతే.. ఇరాన్ (Iran) ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల్లోని చమురు పైప్లైన్లు ముఖ్యంగా సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలను టార్గెట్ చేయొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఖర్గ్పై దాడుల్ని ట్రంప్ మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు. తన చమురు హబ్పై నియంత్రణ కోల్పోతే.. ఇరాన్ నాశనం అవుతుందని యూఎస్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్ వ్యాఖ్యలు చేశారు. ఖర్గ్ను నియంత్రించేవారు.. యుద్ధం స్వరూపాన్ని నియంత్రించగలరన్నారు. ఈ ఆపరేషన్ నాలుగు దశల్లో జరగొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇరాన్ ఇంధన రంగానికి ఈ ఖర్గ్ ఐలాండ్ అత్యంత కీలకం. పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఈ ద్వీపం నుంచే ప్రధానంగా ఆ దేశ చమురు ఎగుమతులు జరుగుతుంటాయి. అందుకే దీనిని ఇరాన్ ఆర్థిక కిరీటంగా అభివర్ణిస్తుంటారు. ఈ టర్మినల్లో ఒకేసారి 10 సూపర్ ట్యాంకర్లు లోడ్ చేసే అవకాశం ఉంటుంది. రోజుకు ఏడు మిలియన్ బ్యారెళ్ల మేర లోడింగ్ సామర్థ్యం కలిగిఉంది. ప్రస్తుతం ఇరాన్పై బాంబుల వర్షం కురుస్తున్నప్పటికీ.. ఈ ద్వీపంలో కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయి. ఇరాన్ తీరానికి 25-30 కి.మీ దూరంలో ఉండే ఈ ఐలాండ్.. తన చమురు ఎగుమతుల్లో 90 శాతం ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది. సహజ మంచినీరు కలిగిన అతి కొద్ది గల్ఫ్ ద్వీపాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. దీంతో ఇక్కడ శతాబ్దాలుగా వాణిజ్య కార్యకలాపాలు జోరందుకున్నాయి. దేశ చమురు క్షేత్రాలకు, అంతర్జాతీయ మార్కెట్లకు మధ్య ప్రధానమైన లింక్గా మారిపోయింది. ఇప్పుడు అమెరికా దీనిని స్వాధీనం చేసుకుంటే.. అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.